Subscribe Us

header ads

డేటా అనుసంధానం వేగ‌వంతం చేయాలి


 

శాంతిభ‌ద్ర‌త‌ల పరిరక్షణకు సీసీ కెమెరాలు విస్తృతంగా ఉపయోగించండి

వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌లో మరిన్ని సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు పరిశీలించండి

ఆర్టీజీఎస్‌పై స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి: ప్ర‌భుత్వ శాఖ‌ల మ‌ధ్య డేటా అనుసంధాన‌ ప్ర‌క్రియ వేగ‌వంతం చేయాల‌ని ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అధికారుల‌ను ఆదేశించారు. స‌చివాల‌యంలో సోమ‌వారం రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్‌)పై ముఖ్య‌మంత్రి స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు మాట్లాడుతూ..అన్ని శాఖ‌ల మ‌ధ్య ఉన్న డేటాను ఆర్టీజీఎస్‌తో అనుసంధానం చేసే ప‌నుల్లో మ‌రింత వేగం పెర‌గాల‌ని సూచించారు. డేటా మొత్తం ఒక చోటుకు చేర్చి డేటాలేక్ ఏర్పాటు చేసుకోవ‌డం ద్వారా ప్ర‌భుత్వ సేవ‌లు మ‌రింత వేగంగా, మెరుగ్గా అందించేందుకు వీలుంటుంద‌న్నారు. 

ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్, డీప్ టెక్నాల‌జీ లాంటి సాంకేతిక‌త‌ల‌ను ఉప‌యోగించుకుని డేటాను విశ్లేషించుకుని ఆయా శాఖ‌ల ప‌నితీరు మెరుగుప‌ర‌చ‌డానికి దోహ‌ద‌ప‌డేలా ఆర్టీజీఎస్ సాంకేతిక స‌హ‌కారం అందించాల‌న్నారు. వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా ప్ర‌జ‌ల‌కు సులభంగా సేవ‌లు అందించ‌గ‌ల‌మ‌ని, ప్ర‌స్తుతం అందిస్తున్న సేవ‌ల‌తో పాటు అదనంగా ఏం అందించ‌గ‌ల‌మో పరిశీలించాలని ఆదేశించారు. వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ వినియోగించేవారికి సాంకేతిక అవ‌రోధాలు లేకుండా చూడాల‌ని అధికారుల‌ను సీఎం ఆదేశించారు. 

 శాంతిభ‌ద్ర‌త‌ల పరిరక్షణకు విస్తృతంగా సీసీ కెమెరాలు

రాష్ట్రంలో ఇప్పటివరకు 14,770 సీసీ కెమెరాల‌ను వినియోగంలో ఉన్నాయని, శాంతి భ‌ద్ర‌త‌ల ప‌ర్య‌వేక్ష‌ణ‌, నేర‌స్థుల‌ను ప‌ట్టుకోవ‌డంలో ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్ త‌దిత‌ర సాంకేతికను ఉప‌యోగించుకోవాలన్నారు. నేరస్తులను గుర్తించేందుకు సీసీ కెమెరాలు కీల‌క పాత్ర‌పోషిస్తాయన్నారు. నేరం జ‌రిగిన వెంట‌నే సమీప పోలీసు స్టేష‌న్ ఉన్న‌తాధికారికి అల‌ర్ట్ మెసేజ్ వెళ్లి, నేర‌స్థులు పారిపోకుండా ప‌ట్టుకునేందుకు సీసీ కెమెరాలు స‌హాయ‌ప‌డేలా రూపకల్పన చేయాలన్నారు. శాంతి భ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగించే రౌడీషీట‌ర్ల‌పైన కూడా ముందుగానే నిఘా పెట్టి, నేరాల‌ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. 

ఆర్టీజీఎస్ సీఈఓ కె.దినేష్ కుమార్ మాట్లాడుతూ ఆర్టీజీఎస్ చేప‌డుతున్న వివిధ కార్య‌క్ర‌మాలు ఏఏ ద‌శ‌ల్లో ఉన్నాయో ముఖ్య‌మంత్రికి వివ‌రించారు. ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్‌ను విస్తృతంగా వినియోగించుకోవ‌డానికి గూగుల్ సంస్థ స‌హ‌కారం అందిస్తోంద‌ని చెప్పారు. ఈ స‌మావేశంలో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె. విజ‌యానంద్‌, డీజీపీ హ‌రీష్ కుమార్ గుప్త‌, సీఎం కార్య‌ద‌ర్శి పీఎస్ ప్ర‌ద్యుమ్న‌, సమాచార పౌర‌సంబంధాల‌ శాఖ సంచాల‌కులు హిమాంశు శుక్లా, జీఎస్ డ‌బ్ల్యూ డైరెక్ట‌ర్ శివ‌ప్ర‌సాద్ త‌దిత‌రులు పాల్గొన్నారు.