హౌసింగ్ లేఅవుట్లలో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు చేయాలని కోరిన మంత్రి కొలుసు పార్థసారథి
అమరావతి :విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు సహకారం...
* ఏపీజెన్కో, ఏపీట్రాన్స్ కో, ఏపీ డిస్కమ్స్ ల పైనా రివ్యూ..
*-కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల, ఇంధన శాఖల మంత్రివర్యులు మనోహర్ లాల్ ఖట్టర్*
గృహ నిర్మాణం, పురపాలక మరియు పట్టణాభివృద్ధి, ఇంధన రంగాలకు సంబంధించి ఏపీకి కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉంటుందని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల, ఇంధన శాఖల మంత్రివర్యులు మనోహర్ లాల్ ఖట్టర్ అన్నారు. ఈ మేరకు శనివారం విజయవాడలోని నోవాటెల్ లో స్టేట్ హౌసింగ్, ఎనర్జీ, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్మెంట్ శాఖలపై కేంద్రమంత్రి రివ్యూ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర గృహ నిర్మాణ & సమాచార, పౌర సంబంధాల శాఖామాత్యులు కొలుసు పార్థసారథి, పురపాలక & పట్టణాభివృద్ధి శాఖామాత్యులు పి.నారాయణ, ఇంధన శాఖామాత్యులు గొట్టపాటి రవికుమార్ హాజరుకాగా.. ఆయా శాఖల పనితీరు, రాష్ట్ర ప్రభుత్వ చర్యలు, కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అధికారులు కేంద్రమంత్రికి వివరించారు.
*ఈ సందర్భంగా కేంద్ర విద్యుత్ & హౌసింగ్, అర్బన్ అఫైర్స్ శాఖల మంత్రివర్యులు మనోహర్ లాల్ ఖట్టర్ మాట్లాడుతూ..* గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనితీరు చాలా బాగుందన్నారు. గృహ నిర్మాణ, పురపాలక & పట్టణాభివృద్ధి, ఇంధన రంగాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రశంసించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఫుల్ సపోర్ట్ ఉంటుందని ఖట్టర్ భరోసా ఇచ్చారు.
*రాష్ట్ర గృహ నిర్మాణ & సమాచార, పౌర సంబంధాల శాఖామాత్యులు కొలుసు పార్థసారథి మాట్లాడుతూ..* కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పీఎంఏవై అర్బన్ 2.0 కి శ్రీకారం చుట్టామన్నారు. పీఎంఏవై-యు, హౌసింగ్ లేఅవుట్లలో మౌలిక సదుపాయాల కల్పనకు త్వరితగతిన నిధులు మంజూరు చేయాలని కోరారు. గత ప్రభుత్వం లేఅవుట్లలో మౌలిక సదుపాయలను పట్టించుకోలేదన్నారు. దీంతో చాలామంది ఇప్పటికీ గృహ ప్రవేశానికి నోచుకోలేకపోతున్నారని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.. మంత్రి పార్థసారథి ప్రతిపాదనలకు కేంద్రమంత్రి ఖట్టర్ సానుకూలంగా స్పందించారు.
*రాష్ట్ర పురపాలక & పట్టణాభివృద్ధి శాఖామాత్యులు పి.నారాయణ మాట్లాడుతూ..* విజయవాడ, విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టులకు త్వరగా ఆమోదం తెలపాలని కోరారు. ఆయా ప్రాజెక్ట్ లకు సంబంధించి గతంలోనే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు కూడా జరిగాయని తెలిపారు. అలాగే అమృత్ 2 పథకం పనులు కొనసాగింపునకు సహకరించాలని.. గత ఐదేళ్లుగా రాష్ట్రంలో అమృత్ పథకం అమలుకు నోచుకోలేదన్నారు. మంత్రి నారాయణ ప్రతిపాదనలకు కేంద్రమంత్రి ఖట్టర్ సానుకూలంగా స్పందించారు.
అనంతరం.. కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను మంత్రులు కొలుసు పార్థసారథి, పి.నారాయణ, గొట్టిపాటి రవికుమార్.. జ్ఞాపిక, దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీలు విజయానంద్, అజయ్ జైన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ సెక్రటరీ కన్నబాబు, హౌసింగ్ ఎండీ రాజాబాబు, పురపాలక శాఖ కమిషనర్ హరి నారాయణన్, ఏపీ ట్రాన్స్ కో జేఎండీ కీర్తి, టిడ్కో ఎండీ సునీల్ కుమార్ రెడ్డి, మెప్మా ఎండీ తేజ్ భరత్, స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఎండీ అనిల్ కుమార్ రెడ్డి, ప్రజారోగ్య విభాగం ఇంజినీరింగ్ చీఫ్ మరియన్న తదితరులు ఆయా శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
అంతకుముందు.. విజయవాడ నోవాటెల్ కు చేరుకున్న కేంద్ర విద్యుత్ & హౌసింగ్, అర్బన్ అఫైర్స్ శాఖల మంత్రివర్యులు మనోహర్ లాల్ ఖట్టర్ కు కేంద్ర భారీ పరిశ్రమలు & ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ, మంత్రులు గొట్టిపాటి రవికుమార్, పి. నారాయణ, ఏపీ ట్రాన్స్ కో జేఎండీ కీర్తి, విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర సాదర స్వాగతం పలికారు..