Subscribe Us

header ads

ఢిల్లీలో కేంద్రమంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ


 


రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులకు సాయం అందించాలని కోరిన సీఎం

ఢిల్లీ :ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు, కేంద్ర పథకాలపై కేంద్ర మంత్రులతో మంగళవారం చర్చించారు. విదేశీ పర్యటన ముగించుకుని సోమవారం రాత్రి ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు...నలుగురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించారు. ముందుగా కేంద్ర జల్ శక్తి మంత్రి సి.ఆర్.పాటిల్ తో భేటీ అయిన చంద్రబాబు జల్ జీవన్ మిషన్ పథకానికి కేంద్ర నిధుల మంజూరుపై చర్చించారు.

 కేంద్ర పథకమైన జల్ జీవన్ మిషన్ ను రాష్ట్రంలో విస్తృత స్థాయిలో ఉపయోగించుకోవాలని భావిస్తున్న ముఖ్యమంత్రి....ఈ పథకానికి నిధుల విడుదలపై కేంద్ర మంత్రితో చర్చించారు. అదే విధంగా రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చేందుకు ప్రతిపాదించిన పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టుపైనా కేంద్ర జలశక్తి మంత్రికి వివరించి...ఈ ప్రాజెక్టుకు సాయం చేయాలని కోరారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే కలిగే ప్రయోజనాలు ముఖ్యమంత్రి కేంద్ర మంత్రికి వివరించారు. అదే విధంగా కేంద్ర అటల్ భూజల్ యోజన్ కార్యక్రమంపై భేటీలో చర్చించారు. భూగర్భ జలాల వృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించిన సిఎం...ఈ కార్యక్రమానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. అనంతరం న్యాయ శాఖా మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ తో ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు. 

కర్నూలులో హై కోర్టు బెంచ్ అంశంపై ఆయనతో చర్చించారు. బెంచ్ ఏర్పాటుకు అవసరమైన కార్యాచరణ అమలు చేసి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం వాణిజ్య, పరిశ్రమల శాఖా మంత్రి పీయూష్ గోయల్ తో భేటీ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు...అమెరికా సుంకాల కారణంగా రాష్ట్రంలో ఆక్వా రంగంలో నెలకొన్న సమస్యలపై చర్చించారు. భారతదేశ సీ ఫుడ్స్ పై విధించిన 26 శాతం సుంకాలు ఏపీలోని ఆక్వా రంగానికి తీవ్ర నష్టం చేస్తున్నాయని సిఎం వివరించారు. ఈ విషయంలో అమెరికాతో చర్చించి ఆక్వా రైతులు నష్టపోకుండా చూడాలని కోరారు. దీని కోసం తీసుకోవాల్సిన స్వల్ప కాలిక, మధ్యస్థ, దీర్ఘకాలిక చర్యల గురించి పలు ప్రతిపాదనలు సూచించారు. 


అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలను అమిత్ షాకు సీఎం చంద్రబాబు వివరించి మద్దతుగా నిలవాలని కోరారు. ఈ భేటీ లలో కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు పాల్గొన్నారు.